రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ ను బీజేపీ ప్రకటించింది. కర్నూలులో జరిగిన సమావేశంలో ఈ డిక్లరేషన్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దని అన్నారు. రాయలసీమను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. డిక్లరేషన్ లోని డిమాండ్లను సాధించుకునే క్రమంలో ఈ నెల 28వ తేదీ నుంచి కడప జిల్లాలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.
డిక్లరేషన్ లోని ప్రధాన అంశాలు ఇవే:
రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
సీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలి.
రాయలసీమలో ఉన్న 4 జిల్లాలను 8 జిల్లాలుగా విభజించాలి.
సీమ ఇరిగేషన్ కు రూ. 10 వేల కోట్లు కేటాయించాలి.
వచ్చే బడ్జెట్ లో రాయలసీమకు రూ. 20 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలి.
రాయలసీమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి.
6 నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలి.