సెంచూరియన్: దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరిగిన ఆరో వన్డే మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. సౌతాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఆరు వన్డేల సిరీస్ను 5-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో సెంచరీ చేశాడు. కెరీర్లో అతనికిది 35వ సెంచరీ కాగా కెప్టెన్గా 13వ సెంచరీ. టాస్ గెలిచిన టీమిండియా మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 204 పరుగులు చేసి ఆలౌటయింది.
దక్షిణాఫ్రికా ఆటగాడు జోండొ 54 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఇతర ఆటగాళ్లు ఫెలుక్వాయో 34, డివిలియర్స్ 30, మర్క్రమ్ 24, క్లాసెస్ 22, మోర్కెల్ 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఇక.. భారత్ బౌలర్లలో శార్దూల్ నాలుగు వికెట్లు తీయగా... చాహల్, బుమ్రా రెండు, పాండ్య, కుల్దీప్ చెరో వికెట్ తీశారు. అనంతరం 205 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 32.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి విజయం సాధించింది. కోహ్లి-129, రహానే-34, రోహిత్-15 పరుగులు చేసి భారత్ విజయానికి బాటలు వేశారు.