విజయవాడ, మేజర్న్యూస్: వెలగపూడి సచివాలయ ఆవరణలోని అసెంబ్లీని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం పరిశీలించారు. పార్కింగ్, మీడియా పాయింట్ నిర్మాణపనులను చూశారు. అసెంబ్లీ హాల్లో సీటింగ్, సౌండ్ సిస్టమ్, ఓటింగ్ తదితర ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ తక్కువ సమయంలోనే అసెంబ్లీని అద్భుతంగా నిర్మించారని సీ ఆర్డీఏ అధికారులను, కాంట్రాక్టర్లను కొనియాడారు. మార్చి 2న ఉదయం 11.25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీని ప్రారంభిస్తారని చెప్పారు. మార్చి 6 నుంచి ఉభయ సభలు సమావేశ మవు తాయని, 13న సాధారణ బడ్జెట్, తరువాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతా మన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వసతి కల్పించలేకపోతున్నా మని, వసతి కల్పించలేకపోతున్నందుకు అదనంగా ప్రతి సభ్యుడికి రూ.50వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. సమావేశాలకు వచ్చే వారు ఎవరి వసతి వారే సమకూర్చుకోవాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కొత్త అసెంబ్లీలో చర్చలు జరిగాలని యనమల ఆకాంక్షించారు. ప్రతిపక్షం లేవ నెత్తే అంశాలపై చర్చకు అధికారపక్షం సిద్ధంగా ఉందని, సభా సమయాన్ని అనవసరంగా వృధా చేయవద్దని యనమల విజ్ఞప్తి చేశారు.