ఒకవైపు విభజన హామీల కోసమని జేఏసీని ఏర్పాటు చేస్తానని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ జేఏసీలో సభ్యులుగా జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ల పేర్లను ప్రస్తావించారు పవన్. వీరిలో జేపీతో పవన్ ఇప్పటికే సమావేశం అయ్యారు. ఈ విషయంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభవం స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పోరాటం విషయంలో పవన్ కల్యాణ్ నాయకత్వం సరిపోదు అని ముద్రగడ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పందించాలని, టీడీపీ కేంద్ర మంత్రుల చేత రాజీనామాలు చేయించి.. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చి పోరాడితే అప్పుడు కేంద్రంలో కదలిక ఉందని ముద్రగడ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తమ జాతి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. తిరుపతిలో నిర్వహించిన బలిజల ఆత్మీయ సదస్సులో ముద్రగడ మాట్లాడారు.
ఇక తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్ల హామీ విషయంలో తమ పోరాటం ఆగిపోలేదన్నారు. సరైన సమయంలో బాబుకు బుద్ధి చెప్పేలా పోరాడతామని ఆయన ప్రకటించారు. తహసీల్దార్ నుంచి కాపులు ‘బీసీలు’గా సర్టిఫికెట్ అందుకున్నప్పుడే.. రిజర్వేషన్లు వచ్చినట్టు అని అన్నారు. చంద్రబాబు కాపులను మోసం చేయాలని అనుకుంటే, ఆయనకు ఎలా మోసం చేయాలో తమకు తెలుసని ముద్రగడ అన్నారు.