ఏడో వేతన సంఘం వ్యక్తిగత ఆదాయాన్ని పెంచినందున పన్ను మినహాయింపు పరిమితిని మరో 50 వేలు పెంచి రూ.3 లక్షలు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. తద్వారా 75 లక్షల మందికి లాభం చేకూరుతుందని తెలిపింది. అంతేగాకుండా గృహ రుణాల్లోనూ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని ఆ నివేదికలో ఎస్బీఐ పేర్కొంది. తద్వారా గృహ రుణాలు తీసుకున్న మరో 75 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. దాని వల్ల ప్రభుత్వానికి కేవలం రూ.7,500 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ఐదేళ్ల పాలనా కాలంలో చివరి, ఐదో వార్షిక బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఎస్బీఐ.. ‘యూనియన్ బడ్జెట్: ఇఫ్ విషెస్ వర్ హార్సెస్’ అనే నివేదికను తయారు చేసింది.
బ్యాంకు డిపాజిట్లపై ఏడాది కాలానిగానూ ఇన్సెంటివ్స్ ఆధారిత సేవింగ్స్ను తీసుకురావాల్సిందిగా సూచించింది. తద్వారా ప్రభుత్వానికి సేవింగ్స్ ఖాతాపై వడ్డీలు మినహాయించే సౌలభ్యం కలుగుతుందని పేర్కొంది. మరోవైపు టర్మ్ డిపాజిట్లలో టీడీఎస్పై ప్రస్తుతమున్న రూ.10 వేల పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిందిగా నివేదికలో పొందుపరిచింది. పన్ను ఆదా చేసుకునే టర్మ్ డిపాజిట్లపై నిర్దేశిత కాలపరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాల్సిందిగా సూచించింది. ప్రభుత్వం విధించుకున్న సమ్మిళిత వృద్ధి, మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే ప్రస్తుత బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం తయారు చేసినట్టు ఎస్బీఐ ఆశిస్తోందని నివేదికలో పేర్కొంది.
బడ్జెట్లో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, మౌలికవసతులు, గృహ వసతి వంటి వాటికే బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించాలని పేర్కొంది. వ్యవసాయ సంక్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన వ్యవస్థలపై పున:సమీక్షించుకోవాలని, స్వేచ్ఛా వర్తకం జరిగేలా చూడాలని సూచించింది. మరోవైపు కనీస మద్దతు ధరలు అత్యతం తక్కువగా ఉన్నప్పుడు భవతార్ కృషి యోజన వంటి పథకాలు రైతులకు మేలు చేస్తాయని, రైతు రుణాల మాఫీతో పోలిస్తే దానికి 10 శాతం మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది.
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు పాలను అందించేలా నిబంధనలు రూపొందిస్తే ఏటా 1.6 కోట్ల మందికి సరిపోయేంత ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. ఇక, పెట్టుబడి పునర్వ్యవస్థీకరణపై స్పందించిన నివేదిక.. అనుకున్న పెట్టుబడి దాటిపోయి ప్రాజెక్టుల్లో జాప్యం జరిగితే పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలని సూచించింది. అలాంటి సందర్భాల్లో పెరిగిన పెట్టుబడికి రిబేటు వడ్డీ రేటుతో రుణాలిచ్చే సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. సంఘటిత రంగం వారికి నెలవారీగా పేరోల్ను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించింది.