హర్యానా : పద్మావత్ చిత్రం జనవరి 25న దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ దాడులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ర్టాలు ముందస్తుగానే ఆ సినిమాపై నిషేధం విధించాయి. పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ.. హర్యానా కురుక్షేత్రలోని ఓ మాల్పై 20 నుంచి 22 మంది యువకులు ఆదివారం రాత్రి దాడి చేశారు. మాల్లోకి ప్రవేశించిన దుండగులు.. గాల్లోకి కాల్పులు జరిపారు. అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వారిని కత్తులతో బెదిరించారు. మాల్పై దాడి చేసిన వారిలో కొందరిని గుర్తించామని హర్యానా పోలీసులు తెలిపారు. ఈ దాడిపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. మాల్పై దాడి ఘటనను హర్యానా సీఎం మనోహర్ లాల్ఖట్టర్ ఖండించారు. కొందరు వ్యక్తులు సినిమా చూడొద్దన్న మాత్రాన.. సినిమాను నిలిపివేయడం సరికాదన్నారు సీఎం. ఇష్టం లేని సినిమా చూడాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం తమ విధి అని అన్నారు. ఈ క్రమంలో పద్మావత్ ప్రదర్శించే థియేటర్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తారని హర్యానా సీఎం స్పష్టం చేశారు.