ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరసనల మాటున రెచ్చిపోతున్న దొంగలు...బీహార్ లో రూ.3లక్షల నగదు చోరి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 05:49 PM

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడుతున్నాయి. నిరసనల సందర్భంగా జరిగే విధ్వంసం మాటున తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చోరీలకు కూడా పాల్పడుతున్నారని అధికార వర్గాలు  వెల్లడించాయి. సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల రైల్వే స్టేషన్ల వద్ద విధ్వంసమే జరిగింది. రైళ్లకు నిప్పంటించి, అక్కడ ఆస్తులను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, ఈ నిరసన ముసుగులో కొంతమంది తమ చేతివాటం ప్రదర్శించారు. బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రూ.3లక్షల నగదును ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


బిహార్‌లోని అర్రాహ్‌ ప్రాంతంలోని బిహియా రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం యువత ఆందోళనకు దిగింది. స్టేషన్‌లోని దుకాణాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. అదే అదునుగా చేతివాటం ప్రదర్శించింది. కొందరు ఆందోళనకారులు టికెట్ కౌంటర్‌లోని రూ.3లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిహార్‌లో శుక్రవారం ఐదు రైళ్లకు నిప్పంటించగా.. బిహార్‌ డిప్యూటీ సీఎం రేణు దేవి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ నివాసాలను ముట్టించారు.


బిహార్‌లో శనివారం బంద్ కొనసాగుతున్నప్పటికీ చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం అర్వాల్‌ జిల్లాలో కొందరు నిరసనకారులు అంబులెన్స్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. పలు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అటు యూపీలోనూ నిన్న హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా.. 260 మందిని పోలీసులు అరెస్టు చేశారు.


మరోవైపు, ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రం కావడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మరోసారిగా గట్టిగా సమర్థించారు. మాజీ సైనికులతో సహా విస్తృత సంప్రదింపుల తర్వాత దీనిని రూపొందించామని, రాజకీయ కారణాలతో అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఈ పథకం ద్వారా సైనికుల నమోదు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని, రిక్రూట్ అయ్యే సిబ్బందికి శిక్షణలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.


మాజీ సైనికుల సంఘంతో సహా సుమారు రెండేళ్లపాటు చర్చించిన తర్వాత ఈ పథకాన్ని రూపొందించామని, ఏకాభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజలలో క్రమశిక్షణ, దేశం పట్ల గర్వం అనే భావం ఉండాలని కోరుకున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘ దేశ సైనికుల మనోధైర్యాన్ని తగ్గించాలా? ఇది న్యాయం కాదు’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com