ఏడు సంవత్సరాల వయస్సున్న చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఈ ఘటన అటవీ అధికారుల సమక్షంలోనే జరగడం విశేషం.దీంతో అధికారులు దీనికి బాధ్యులైన 150 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. పౌరి గర్వాల్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక చిరుత పులి మహిళపై దాడి చేయడంతో, ఆమె మరణిచింది.దీంతో స్పందించిన అధికారులు చిరుతను పట్టుకునేందుకు గ్రామంలో బోన్లు ఏర్పాటు చేశారు. గత మంగళవారం చిరుత ఒక బోనులో చిక్కుకుంది. చిరుత చిక్కందని గ్రామస్తుల నుంచి సమాచారం రావడంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి, చిరుతను వేరే చోటుకు తీసుకెళ్దామనుకున్నారు. అయితే, తమ గ్రామంలోని మహిళ మరణానికి కారణమైందన్న ఉద్దేశంతో కొందరు గ్రామస్తులు ఆ చిరుత విషయంలో ఆగ్రహంతో ఊగిపోయారు. చిరుత ఉన్న బోను దగ్గరకు చేరుకుని, దానిపై పెట్రోలు చల్లారు. బోనులో గడ్డి వేసి తగులబెట్టారు. దీంతో చిరుతపులి బోనులో అక్కడికక్కడే మరణించింది. ఫారెస్టు అధికారులు వాళ్లను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, వాళ్లు ఆగలేదు. మరోవైపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వాళ్లకు సహకారం అందించారు.