ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో పూర్వవైభవం కోసం..మహానాడు వేదికగా తీర్మానాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 07:04 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనంలా టీడీపీ దూసుకొచ్చింది. ప్రజల్లో తనదైన స్థానం నిలుపుకోంది. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో బలహీనపడగా ఏపీలో వైసీపీ వచ్చాక దాదాపు టీడీపీ ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది. అయితే గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్న పూర్వ వైభవం దిశగా అడుగులేయాలని టీడీపీ భావిస్తోంది. ఇదిలావుంటే ఈ నెల 27న ప్రారంభం కానున్న టీడీపీ పార్టీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. దీనిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేస్తుందన్నారు. టీడీపీ ఈ నెల 27, 28న మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  


ఇదిలావుండగా పెద్ద పండుగగా చెప్పుకునే మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని.. అలాగే భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా కార్యక్రమం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ నెల 27, 28న ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించారు. ఆయా కమిటీ పనితీరును సమీక్షించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. వివిధ వర్గాలనుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడుకు ఉండబోతుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.


మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఇక రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒంగోలులో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం.. తర్వాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు చంద్రబాబుకు వివరించారు. మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నేతలు చెప్పారు.


ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అధికారులు కావొచ్చు.. ఇటు ప్రభుత్వంలోని వ్యక్తులు కావొచ్చు.. వీటికి భవిష్యత్‌లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని.. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ.. ఈసారి ప్రజలను నుంచి భారీ మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. మహానాడుకు సౌకర్యాలు, వేదిక నిర్మాణం, భోజన, వసతి కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.


ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి దర్పణం అన్నారు చంద్రబాబు. తన రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదని.. మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని సూచించారు. దీని కోసం ఎప్పుడూ ఉండే పార్టీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com