ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక ప్రజలపై ధరల బాదుడు...లీటర్ పెట్రోల్ రూ.420కి

international |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 04:02 PM

శ్రీలంకలోని పరిస్థితులతో ఉన్నత వర్గాల నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. అక్కడి ప్రజలు అధిక ధరలను భారంగా మోయాల్సి వస్తోంది. తాజాగా తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న‌ శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం పెరగగా, డీజిల్ ధర 38.4 శాతం పెరిగింది. లీటర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.82 పెరిగి, రూ.420కి చేరింది. అలాగే, లీట‌రు డీజిల్ ధ‌ర‌ రూ.111 పెరిగి, రూ.400కు చేరింది. ఈ మేర‌కు సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్ నేటి నుంచే ఈ ధ‌ర‌లు పెంచింది. 


మ‌రోవైపు, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. ర‌వాణా ఛార్జీల‌పై భారం మ‌రింత ప‌డుతుండ‌డంతో అన్ని ర‌కాల వ‌స్తువులు, స‌రుకుల ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. 


ఆటో డ్రైవ‌ర్లు ఇప్ప‌టికే కిలో మీటరుకు ప్రయాణికుడి వద్ద దాదాపు రూ.90 తీసుకుంటున్నారు. శ్రీ‌లంక‌లో ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ తో పాటు ఇతర నిత్యావసరాల కోసం భారీగా క్యూ క‌ట్టాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు శ్రీ‌లంక‌లో విద్యుత్‌ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజ‌ల‌ను వేధిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com