కేరళలో గతేడాది మెడికల్ విద్యార్థి విస్మయ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువడింది. విస్మయ భర్త కిరణ్ కుమార్ ను కేరళ కోర్టు దోషిగా తేల్చింది. కట్నం కోసం వేధించి, విస్మయను భర్తే ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని కోర్టు నిర్దారించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న కిరణ్ ను తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. ఈ కేసులో దోషికి సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలా చూస్తామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్రాజ్ పేర్కొన్నారు.
విస్మయ చదువు పూర్తి కాకముందే 2019 మే 19న ఆమెకు తన తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్ కుమార్ తో పెళ్లి జరిపించారు. కట్నంగా 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ.10లక్షల కారు ఇచ్చారు. అయితే కారు నచ్చలేదని, తనకు రూ.10లక్షలు డబ్బు ఇవ్వాలని కిరణ్ డిమాండ్ చేశాడు. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురిచేసేవాడు.
2021 జూన్ 20న విస్మయ తన కుటుంబ సభ్యులకు ఓ వాట్సాప్ మెసేజ్ చేసింది. కట్నం కోసం కిరణ్ తనను వేధిస్తున్నాడని, అతడు కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫొటోలు తీసి అందరికీ పంపింది. ఆ మరుసటి రోజే కొల్లాం జిల్లా సస్థంకొట్టాలోని కిరణ్ ఇంట్లో ఆమె శవమై కనిపించింది. కాగా విస్మయ మృతికి కిరణే కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి, వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందంటూ 500పేజీలకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సోమవారం కిరణ్ ను దోషిగా తేల్చింది.