ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ గుడ్ న్యూస్ అందించింది. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. ఫలితంగా బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ నెల 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వివిధ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని వెల్లడించింది. వాతావరణంలో మార్పులు, నైరుతి రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. అయితే గాలిలో తేమ శాతం కారణంగా ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోనూ రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో నేటి నుంచి 21 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.