ఆఫ్ఘానిస్థాన్లోని బాలికలను అతి త్వరలో పాఠశాలలకు అనుమతిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహీద్ మంగళవారం తెలిపారు. తాలిబాన్ ప్రభుత్వంలో పూర్తిగా పురుషులతో మంత్రిమండలిని ప్రకటించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెలువరించారు. బాలికల విద్యపై మేం జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. అతి త్వరలో వారిని పాఠశాలలకు అనుమతిస్తామని చెప్పారు. పురుష ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ ఈ వారాంతంలో చెప్పింది. కానీ, బాలికల గురించి ప్రస్తావించలేదు. తాలిబాన్లు గత వారంలో మహిళ సంక్షేమ శాఖ పేరును మార్చి మతపరమైన హక్కులను కాపాడే శాఖగా మార్చారు. దేశం సంక్షేమ బాటలో నడవాలంటే ఇటువంటి శాఖలు తప్పనిసరన్నారు.