గుంటూరు: ప్రమాదవశాత్తూ కాలువలో పడి ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన స్థానికంగా చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లూరు మండలంలోని ఈపూరు సమీపంలోని కృష్ణా పశ్చిమ బ్యాంకు బ్రాంచి కెనాల్ లో ఓ మృతదేహం ఉన్నట్టు ఆదివారం పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని,మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.
తదుపరి స్థానికులను విచారించగా మృతురాలు అనంతవరానికి చెందిన నక్కా సుశీల (65)గా గుర్తించారు. కొద్దికాలంగా ఈమె మతిస్థిమితం కోల్పోయి, అనారోగ్యంతో బాధపడుతోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిన ఈమె ఎటు వెళుతుందో తెలియని స్థితిలో ప్రమాదవశాత్తూ కాలువలో పడి ఉంటుందని వారు పేర్కొన్నారు. మృతురాలి భర్త సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉజ్వల్ కుమార్ తెలిపారు.