ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందిన పార్టీల వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5998 చోట్ల వైసీపీ, 826 చోట్ల టీడీపీ, 177 చోట్ల జనసేన, 28 చోట్ల బీజేపీ, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు.
ఇక కడప జిల్లా జమ్మలమడుగు, ముద్దనూరు, విశాఖ జిల్లా గొలుగొండ జడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు నిలుపుదల చేశారు. కడప జిల్లాలోని కొర్రపాడు, గొరిగనూరు, విశాఖ జిల్లా పాకలపాడు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడించలేదు. బ్యాలెట్ బాక్సుల్లోకి నీరు చేరడంతో బ్యాలెట్ పత్రాలు తడిచిపోయాయి. కొన్ని పత్రాలు ఎండలో ఆరబెట్టి లెక్కించినా ఇంకొన్నింటిని లెక్కించడం సాధ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వీటి ఫలితాలు ప్రకటించకుండా ఎస్ఈసీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.