విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి నేవల్ డాక్యార్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... శ్రీహరిపురంలో నివాసం ఉంటున్న కేసరపు కన్నయ్యశెట్టి హిందుస్థాన్ షిప్యార్డులో పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అభిలాష్(27) నగరంలోని ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. విధులు పూర్తయ్యాక రాత్రి 7.35 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగొస్తున్నారు. డాక్యార్డు దరి కాకతీయగేటు పరిసరాల్లోకి వచ్చేసరికి వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన రెడీమేడ్ కాంక్రీటు మిక్చర్ లారీ అభిలాష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కింద పడిపోయిన అభిలాష్ మీద నుంచి లారీ దూసుకెళ్లడంతో... అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, నేవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.