ఒకే ఇంట్లో నలుగురు ఒకేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ ఇంట్లోని 9 నెలల శిశువు ఆకలితో చనిపోయింది. మరో రెండేండ్ల పసిపాప 3 రోజుల పాటు ఆ నలుగురి శవాల మధ్యే ఉండిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని తిగళరపాళ్య చేతన్ ఏరియాలో శంకర్ కుటుంబం నివసిస్తోంది. శంకర్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలకు వివాహమైంది. కుమారుడి వయసు 27 ఏళ్లు. అయితే పెద్ద కూతురు కాన్పు కోసం కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు రెండేళ్ల కూతురు కూడా ఉంది.
కాన్పు అయి నెలలు గడుస్తున్నప్పటికీ పెద్ద కూతురు అత్తగారింటికి వెళ్లలేదు. దీంతో అత్తగారింటికి వెళ్లాలని తండ్రి ఆమెకు చెప్పాడు. తన అత్తమామలతో సమస్యలు ఉన్నాయని, కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని పెద్ద కూతురు తండ్రికి బదులిచ్చింది. తన మాట ఎవరూ వినడం లేదని తండ్రి శంకర్ ఆగ్రహించి 5 రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాడు.
అక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేయగా కుటుంబ సభ్యులెవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చినా అతను ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు తెరిచి చూడగా భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉరేసుకుని కనిపించారు. పెద్ద కూతురు కొడుకు(9 నెలల శిశువు) ఆకలితో చనిపోయాడు. రెండేళ్ల పాప స్పృహా కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.