ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం భయం కారణంగానో, నిర్లక్ష్యం కారణంగానో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధిస్తూ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణం మినహా మరే ఇతర కారణంతోనైనా ఇప్పటివరకూ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులను సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఈ నెల 15 తర్వాత సెలవుపై పంపిస్తామని సీఎం స్పష్టంచేశారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకునే వరకు వారు సెలవుపై ఉండాల్సి వస్తుందన్నారు.