ఛత్తీస్గర్లోని బిలాస్పూర్ పరిధిలో ఓ దారుణం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్పూర్ జిల్లా బెల్హా తాలూకాలోని కనేరి గ్రామానికి చెందిన ఖేలూ రామ్ కేవత్(50), అతని మేనల్లుడి భార్య గీతా(35) కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఖేలూరామ్ గ్రామంలో వ్యవసాయం చేస్తుండగా అతని మేనల్లుడి కుటుంబం కూడా అదే గ్రామంలో ఉంటుండేది. ఖేలూరామ్, గీతా సంబంధం గురించి ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో ఇద్దరూ కలిసి ఊరొదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. గత మార్చిలో ఇద్దరూ ఊరు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. ఇద్దరూ అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో, ఏం చేస్తున్నారో ఎవరూ పట్టించుకోలేదు.
కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సరిగ్గా.. మూడు రోజుల క్రితం ఖేలూరామ్, గీతా సొంత గ్రామంలోని పొలాల్లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని శవాలుగా కనిపించారు. గ్రామస్తులు వారిద్దరినీ ఆ స్థితిలో చూసి షాకయ్యారు. ఈ జంట ఆత్మహత్యలపై పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. ఇద్దరి అఫైర్ గురించి తమకు తెలిసి మందలించామని, ఇకపై ఇలా చేయవద్దని చెప్పామని.. తమ మాట పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. చేసిన తప్పుకు పశ్చాతాపంతో ఈ ఇద్దరూ సొంతూరుకి వచ్చి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. స్పాట్లో ఎలాంటి సూసైడ్ నోట్ పోలీసులకు దొరకలేదు.