నెల్లూరు: వెంకటగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారులు గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా సోకడంతో పాఠశాలలోని విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు వైద్య సిబ్బంది చేపట్టారు. కరోనా సోకిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యాధికారి డాక్టర్ తిరుపాలు తెలిపారు.
ఒకటి రెండు రోజుల్లో విద్యార్థులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. పాఠశాలల్లోని విద్యార్థులకు అందరికీ కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో నిబంధనల ప్రకారమే తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కే జయలక్ష్మి తెలిపారు. విద్యార్థులకు జలుబు , దగ్గు ఉండడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు చికిత్స చేస్తున్నట్లు వివరించారు.