కేరళలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారందరికీ థర్మల్స్కాన్ చేస్తున్నారు. రెండు టీకా డోస్లు వేసుకున్నట్లు ధ్రువపత్రాల తో వచ్చేవారిని మాత్రం ఎలాంటి పరీక్షలు చేయకుండా రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
కోయంబత్తూరు, ఈరోడ్, చెంగల్పట్టు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవతోంది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి వచ్చేవారి వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానించిన ఆరోగ్యశాఖ అధికారులు ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక వైద్యపరీక్షల శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా కేరళ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ థర్మల్స్కాన్ జరుపుతున్నారు. వారి వద్దనున్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలితే, వారిని ఆయా శిబిరాల వద్ద క్వారంటైన్లో ఉంచేందుకు కూడా ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదే విధంగా రాష్ట్రం నుంచి కేరళలోకి వెళ్లేవారికి కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.