ఇండియాలో ఇప్పటివరకు 300 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తొలగిపోలేదని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31 నాటికి దేశంలో 39 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని చెప్పారు. మరో 38 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు చెప్పారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో రాబోయే పండుగల సీజన్ లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనం భారీగా గుమిగూడొద్దని, ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.