కొన్ని కరోనా వ్యాక్సిన్ల వల్ల రక్తం గడ్డ కడుతున్నాయని కొన్ని టీకాల వినియోగంపై కొన్ని దేశాల్లో పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన పరిశోధకులు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కంటే కరోనా సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువని తేల్చారు. ఈ పరిశోధన ఫలితాల్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు.
ఆక్స్ఫర్డ్, లేసెస్టర్, కేంబ్రిడ్జి, ఎడిన్బర్గ్, నాటింగ్హామ్ యూనివర్సిటీలు సహా ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా తొలి డోసు తీసుకున్న మొత్తం 2.9 కోట్ల మందిపై ఈ అధ్యయనం చేశారు. డిసెంబరు 1, 2020- ఏప్రిల్ 24, 2021 మధ్య ఈ పరిశోధన జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ముప్పు కరోనా సోకిన వారిలో మరింత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. పైగా వీరిలో దీర్ఘకాలం ఈ సమస్య ఉండే అవకాశం ఉందని చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా వెంటనే వైద్యసాయం తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే కరోనా బాధితులు దీర్ఘకాలం అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. తద్వారా రక్తం గడ్డ కట్టే ముప్పును ముందే గుర్తించి చికిత్స చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.