మరికాసేపట్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా వధువు తల్లిదండ్రులు చనిపోయిన విషాద ఘటన విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జరిగింది. పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం సమయంలో పెళ్లి కూతురి తల్లిదండ్రుల కోసం బంధువులు వెతికారు. వారు కనిపించలేదు. ఇంటికెళ్లి చూడగా గదిలో విగతజీవులై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు విశాఖపోర్టు విశ్రాంత ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు.
వధువు తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. విజయలక్ష్మి తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని తెలిసింది. పెళ్లి రోజు కూడా భర్తతో ఆమె గొడవ పడిందని సమాచారం. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు ఆమెను చంపి, తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు