ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్నకాలనీల్లో నిర్మించుకునే ఇళ్లపై లబ్ధిదారులకు పావులా వడ్డీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకర్లతో మాట్లాడాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో ఆ పట్టాలపై రుణం తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు సీఎం తెలిపారు. అలా తీసుకునే రుణాలపై లబ్ధిదారుడికి కేవలం పావలా వడ్డీ మాత్రమే పడుతుందని సీఎం స్పష్టం చేశారు. మిగతా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం భరోసానిచ్చారు.