పెళ్లై ఏడాది కూడా కాకముందే ఓ కోడలు తన అత్తింట్లో ఉన్న వాళ్లందరినీ చంపాలనుకుంది. ప్లాన్ వేసి టీ లో విషం కలిపి అందరికి ఇచ్చింది. దీంతో టీ తాగిన వాళ్ళందరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక ఏడాది వయసున్న పిల్లాడు మాత్రం చనిపోయాడు. ఈ ఘటన యూపీలోని బహ్రైచ్ లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.
బహ్రైచ్ తాలూకాలోని మచియాహి గ్రామానికి చెందిన జైశ్వాల్ కుమారుడు పూరన్ కు గతేడాది డిసెంబర్ లో అనిత అనే యువతితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే భర్త కుటుంబంపై ద్వేషం పెంచుకున్న ఆ యువతి భర్తతో సహా అందరినీ చంపాలనుకుంది. ఈ క్రమంలో రోజూ ఉదయం లాగే అనితను టీ పెట్టమని పూరన్ తల్లి చెప్పింది. అనిత అత్తమామలతో పాటు, అదే ఊరిలో ఉండే పూరన్ సోదరి, సోదరుడు, ఏడాదిన్నర వయసున్న పూరన్ సోదరి కొడుకు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. పని మీద పూరన్ బయటకు వెళ్లాడు.
అవకాశం కోసం ఎదురుచూస్తున్న అనిత అందరినీ ఒకేసారి చంపాలనుకుంది. ఆ టీలో విషాన్ని కలిపింది. అందరికీ గ్లాసుల్లో పోసి ఇచ్చింది. ఆ కుటుంబమంతా టీ తాగారు. టీ తాగిన కొద్దిసేపటికీ అందరూ నురగలు కక్కుకుంటూ కిందపడిపోయారు. ఆ పిల్లాడైతే కొద్దిసేపు గిలగిలా కొట్టుకుని అక్కడికక్కడే చనిపోయాడు. ఇంటి పక్కన ఉన్న ఇరుగుపొరుగు వాళ్లు గమనించి అందరినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనితను అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన టీని లీగల్ ఎగ్జామినేషన్ కోసం పంపారు. తన భర్తతో పాటు, అతని కుటుంబంలో ఎవరూ తనకు నచ్చలేదని.. అందుకే అందరినీ చంపాలని టీలో విషం కలిపినట్లు అనిత ఒప్పుకుంది. అనిత వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని అందుకు భర్త, అత్తింటి వారు అడ్డుగా ఉన్నారని భావించి చంపాలనుకుందేమోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆమె నేరం అంగీకరించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.