అగ్రిగోల్డ్ స్కామ్కు గత ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియ అని విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే కష్ట జీవులను సైతం TDP సర్కార్ మోసం చేసిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. రెండో విడతలో 10 వేలలోపు డిపాజిట్దారులకు 208 కోట్లు, 20 వేల లోపు డిపాజిట్దారులకు 459 కోట్లను జమ చేశారు. ఇవాళ ఒక్క రోజే 7 లక్షల మందికి తాము కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం పది లక్షల 40 వేల మందికి 905 కోట్లను అందించారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని తెలిపారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు.
ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని, 2019 నవంబర్లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు, 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు.