లండన్: అఫ్గానిస్థాన్ సంక్షోభానికి ఓ పరిష్కారం చూపడం కోసం అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆ మేరకు రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతామన్నారు. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు వస్తున్న అఫ్గాన్ పౌరులతో నిండిపోయిన కాబుల్ విమానాశ్రయంలో పరిస్థితులు నెమ్మదిగా శాంతిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ విదేశీ బలగాల అధీనంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 1,615 మందిని అఫ్గానిస్థాన్ నుంచి బ్రిటన్కు తరలించామని బోరిస్ ప్రకటించారు. వీరిలో 399 మంది బ్రిటన్ జాతీయులు కాగా.. 320 మంది రాయబార కార్యాలయ సిబ్బంది, 402 మంది అఫ్గాన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అఫ్గానిస్థాన్ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ, బోరిస్ మాత్రం రాబ్కు అండగా నిలబడ్డారు. అఫ్గాన్ నుంచి పౌరుల్ని తరలించడంలో రాబ్ సమర్థంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఓవైపు తాలిబన్ల పాలనను గుర్తించేందుకు అనేక దేశాలు వెనుకాడుతుంటే.. బోరిస్ మాత్రం వారితో కలిసి పనిచేస్తాననడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు రష్యా, చైనా మాత్రమే తాలిబన్లకు మద్దతుగా నిలుస్తున్నాయి.