ఇండియాలో కరోనా వైరస్ ఉద్ధృతి బాగా తగ్గింది. కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. దేశంలో ఆర్-ఫ్యాక్టర్ రేటు తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్-ఫ్యాక్టర్ కరోనా వైరస్ వ్యాప్తి రేటును సూచిస్తుంది. ఒక కరోనా రోగి ద్వారా ఎంత మందికి వ్యాధికి సోకుతుందో చెబుతుంది. ఆగస్టు మొదటి వారంలో ఆర్-ఫ్యాక్టర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అది క్రమంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. థర్డ్ వేవ్ కరోనా వ్యాప్తి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆర్-ఫ్యాక్టర్ క్షీణించడం మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అధ్యయనం చేస్తోంది. ఆగస్టు మొదటి వారంలో జరిపిన అధ్యయనంలో ఆర్ విలువ 1 దాటింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు సమాచారాన్ని విశ్లేషించగా ఈ విలువ 0.9కి క్షీణించిందని ఐఎంఎస్ నిపుణులు పేర్కొన్నారు. వైరస్ బారిన పడిన వారి నుంచి ఇతరులకు సంక్రమించే రేటు తక్కువగా ఉన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని వెల్లడించారు.
ప్రస్తుతం మన దేశంలో కేరళలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఆర్ ఫ్యాక్టర్ ఇప్పుడు 1 కంటే తక్కువగానే ఉంది. మహారాష్ట్రలో 0.89గా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ తగ్గుముఖం పట్టింది. ఇక హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్లో ఆర్ ఫ్యాక్టర్ 1కి చేరువలో ఉంది.
ముంబైలో 0.70, ఢిల్లీలో 0.85 బెంగళూరులో 0.94, చెన్నైలో 0.97గా ఆర్ ఫ్యాక్టర్ నమోదయింది. కోల్కతాలో 1.08, పుణె 1.05 గా ఉంది. ఇక్కడ 1 కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ఆర్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నప్పటికీ.. 5 రాష్ట్రాల్లో 1 కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.