కోవిడ్ పాజిటివిటీ తగ్గించడంలో జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని, వారి పనితీరు పట్ల గర్వపడుతున్నామని డిప్యూటీ సీఎం, తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన బుధవారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ కు కాల్ వచ్చిన మూడు గంటల లోపు కోవిడ్ బాధితులకు బెడ్ సమకూరాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారని, ఇందుకు అనుగుణంగా పడకల సంఖ్య, ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్పై ఎలాంటి అపోహలు అవసరం లేదని, కేంద్రం నుంచి అందుతున్న డోసుల మేరకు జిల్లాలో శాశ్వత కేంద్రాల ద్వారా పంపిణీ చేపట్టాలన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని బాధ్యత రహిత చేస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ధాన్యం పండించే జిల్లాగా పేరున్న తూర్పుగోదావరిలో తాజాగా ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధతపై వివరాలు అడిగారు. ఈ నెల 13న వైయస్సార్ రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద రూ.7,500 నగదును జమ చేయనున్నామని చెప్పారు. ఈనెల 17వ తేదీ నుంచి రైతులకు విత్తనాల సరఫరా చేసేందుకు అవకాశం ఉన్నందున కోవిడ్ వ్యాపించకుండా షెడ్యూల్ జాగ్రత్తగా పాటించాలన్నారు. వైయస్సార్ జగనన్న కాలనీల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణ పనులను జూన్ 1వ తేదీ నాటికి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తు చేసిన ఈ ఒక్క అర్హుడు కూడా నష్టపోకూడదని వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పేరిట జరుగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో కోవిడ్ చికిత్సలు, ఆక్సిజన్ సరఫరా, కొత్తగా బెడ్ లను ఏర్పాటు చేయడం, ఇంకా
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి చెప్పారు. వాలంటీర్ల ద్వారా టోకెన్లు అందిస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చిట్టి బాబు, సూర్యనారాయణ రెడ్డి, జోగేశ్వరరావు, రాపాక వరప్రసాద్, ఎమ్మెల్సీ రవీంద్ర, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా, కీర్తి, పలువురు సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.