ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులోని మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పట్టదా అని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలను కలుపుకొని కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని కనీసం వాళ్ళను చూసైనా జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించరా? అని నిలదీశారు. కరోనా విపత్తును పక్కనపెట్టి జగన్ ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించే వారైతే మంత్రి సిదిరి అప్పలరాజుపై కూడా అవే కేసులు పెట్టగలరా అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.