తన కూతురిని ప్రేమించిన పాపానికి ఓ యువకుడి కాళ్లు, చేతులు నరికి వేశాడు యువతి తండ్రి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో ఈ ఘోరం జరిగింది. కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడికి అదే గ్రామంలో ఉన్న ఇంటర్మీడియట్ చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకుని యువతి తల్లిదండ్రులు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. అప్పటి నుంచి వెంకటేష్ ఊరికి దూరంగా ఉంటున్నాడు.
అయితే తమ కూతురితో ఫోన్ లో టచ్ లోనే ఉన్నాడని తెలుసుకున్న యువతి తండ్రి వెంకటేశ్ ను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. మంగళవారం రాత్రి ఆ యువకుడిని నమ్మకంగా గ్రామానికి రప్పించారు. గ్రామ శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆ యువతి తండ్రి భాస్కర్ రావు, మరో ఐదుగురు కలిసి వెంకటేశ్పై విచక్షణరహితంగా దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంకటేష్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.