అమ్మ అంటే తన పిల్లల పట్ల ప్రేమను చూపాలి. కాని ఆ తల్లి మాత్రం తన బాధను కూడా చూపింది. తన కొడుకు కూతురుతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. చివరకు ఆమె కుమారుడు తప్పించుకోగా ఆమెతో పాటు కుమార్తె చనిపోయింది. నెల్లూరులోని నవాబుపేటకు చెందిన సుబ్బులు(28), ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపెంటకు చెందిన కొండ్రెడ్డి భార్యాభర్తలు. వీరికి మహేష్బాబు(8), మధురవాణి(5) అనే పిల్లలున్నారు. ఈ దంపతులు కర్ణాటకలో పదెకరాల్లో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి అంజూర సాగు చేశారు.
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా పంట అమ్ముకునే అవకాశాలు లేకపోవడంతో సుబ్బులు తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన కొడుకు, కూతురుని వెంట తీసుకుని పుట్టింటికి వస్తూ శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాళెం దగ్గర బస్సు దిగారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న శానిటైజర్ ను తీసి పిల్లల శరీరాలతో పాటు తనపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది. వేడికి తాళలేక కుమారుడు మహేష్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఏడుస్తూ వెళ్లి విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు వచ్చి చూశారు. అయితే అప్పటికే ఆ తల్లీ కూతురు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.