మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. తల్లి లేని సమయంలో ఇంటికి వచ్చి ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ దారుణం గురించి తల్లికి చెబితే ఆ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి కూతురినే దండించింది. నువ్వు అతడినే పెళ్లి చేసుకోవాలంటూ వేధించింది. వారి చర్యలను తాళలేక నరకం అనుభవించిన ఆ చిన్నారి చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. అద్దంకిలో వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రకాశం జిల్లా, అద్దంకి పట్టణానికి చెందిన ఓ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లుగా వేరు వేరుగా ఉంటున్నారు. వీరికి తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు ఉంది. ఈ బాలిక తల్లి వద్దే ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో తల్లికి అద్దంకిలోనే నివాసం ఉంటున్న చినగంజాంకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఆ నీచుడి బుద్ది ఆమె కూతురిపై పడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో వచ్చి ఆ బాలిక పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తించేవాడు. వారించినా వినలేదు. దీంతో విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది ఆ బాలిక. అయితే కూతురుకు అండగా నిలవాల్సిన ఆ తల్లి రివర్స్ తిరిగింది. తన ప్రియుడి చర్యలకు మద్దతు ఇస్తూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. నీవు అతడినే పెళ్లి చేసుకోవాలి అంటూ ఆ బాలికను దండించింది.
తల్లి మాటలకు షాక్ తిన్న ఆ బాలిక మనసులోనే కృంగిపోయింది. చివరకు ధైర్యం చేసిన ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి, ఆమె ప్రియుడు కలిసి చేస్తున్న దారుణం గురించి అధికారులకు వివరించింది. దీంతో జానకిరామయ్యతో పాటు అతనికి మద్దతుగా ఉంటూ వస్తున్న బాలిక తల్లిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.