దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న రైతులు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ప్రభుత్వం టీకాల కేంద్రాలను ప్రారంభించి, నిరసన ప్రదేశాలలో సంబంధిత సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేసింది.
ఢిల్లీలోని వివిధ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను మాస్కులు ధరించాలని మరియు వైరస్ వ్యాప్తిని నివారించడానికి అవసరమైన కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించాలని సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఇంతకుముందు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనాకు సైతం భయపడేది లేదని, వ్యాక్సిన్లు కూడా అవసరం లేదని తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పిన రైతు సంఘం నాయకులు ఇప్పుడు టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ నుండి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు పాయింట్లలో సింగు, తిక్రీ మరియు ఘాజిపూర్లలో నాలుగు నెలలుగా ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. కేంద్రం చివరిగా అమలు చేసిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ నుండి వారి ఆందోళన కొనసాగుతోంది.
టీకా కేంద్రాలు ప్రారంభించాలని , కరోనా కట్టడికి అవసరమైన సదుపాయాలూ కల్పించాలని రైతుల డిమాండ్ టీకా కేంద్రాలను ప్రారంభించడం ద్వారా మరియు నిరసన ప్రదేశాలలో అవసరమైన సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలని కోరుతున్నామని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. కరోనా వ్యాప్తి పై రైతులలో భయానక వాతావరణాన్ని సృష్టించవద్దని నకిలీ వార్తలను వ్యాప్తి చేయవద్దని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు . కరోనా కారణంగా రైతులను ధర్నాను బలవంతంగా మాన్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.