అమరావతి: ఏపీలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోందని, వైరస్ కట్టడి చర్యల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని, బెడ్లు దొరకడంలేదని, సమయానికి అంబులెన్స్లు రావడంలేదని అన్నారు. కరోనా నిబంధనల అమలుకు ప్రభుత్వమే తిలోదకాలిస్తోందని ఆరోపించారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదన్నారు.మొదటి డోస్ వేసుకున్న వారికి రెండో డోస్ అందడం అనుమానమేనన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలు, క్వారంటైన్ వసతులు, కొవిడ్ ఆస్పత్రులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు.