జూన్ 1వ తేదీ నుంచి బంగారం ఆభరణాలపై హాల్ మార్క్ ముద్ర తప్పనిసరి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కల్తీని నివారించడంతో పాటు బంగారం ఆభరణాల తయారీ సంస్థలు ఫిట్ నెస్ ప్రమాణాలను పాటించడానికి వీలుగా కేంద్రం ఈ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బంగారంపై హాల్ మార్కింగ్ వేసి ప్యూరిటీ సర్టిఫికెట్ జారీ చేయడం స్వచ్ఛందంగా సాగుతోంది. కేంద్రం తొలిసారి 2019 నవంబర్ లో బంగారం ఆభరణాలపై హాల్ మార్కింగ్ చేయాలని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుంచి బంగారం ఆభరణాలపై హాల్ మార్కింగ్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తొలుత 4 నెలల గడువు పొడిగించింది. జ్యువెల్లర్ల అభ్యర్థన మేరకు జూన్ 1వ తేదీకి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ముందు హాల్ మార్కింగ్ నిబంధనల అమలు గడువు పొడిగించడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే 2 నెలల్లో లక్ష మంది జ్యువెల్లరీ వ్యాపారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారని కేంద్ర వినియోగ వ్యవహారాలశాఖ కార్యదర్శి లీనా నందన్ తెలిపారు. కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. జువెలర్స్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అంతేతప్ప ఇంకా తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని అమ్మడానికి వీలుండదు. అలాగే బీఐఎస్ మార్క్ తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో 40 శాతం బంగారం మాత్రమే హాల్మార్క్కు వెళ్తోంది. జువెలరీ షాపులు కచ్చితంగా గోల్డ్ హాల్మార్క్ కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. అయితే ప్రజలు వారి వద్ద ఉన్న పాత బంగారాన్ని సులభంగానే విక్రయించొచ్చు. వీటికి గోల్డ్ హాల్ మార్క్ అవసరం లేదు. ఇకపోతే జువెలరీ సంస్థలు కొత్త రూల్స్ ఫాలో కాకపోతే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది.