ఏపీలో స్థానిక సమరం.. సంగ్రామాన్ని తలపిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు.. ఎలక్షన్స్ ఇప్పుడే వద్దంటూ సర్కార్ వ్యతిరేకత రాజకీయ వేడి రాజేస్తోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్ఈసీ ఖరాఖండిగా వ్యవహరిస్తుంటే.. అడ్డుకోవడానికి సర్కార్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. దీంతో రోజురోజుకూ ఏపీలో పంచాయతీ వార్ పెద్దదవుతోంది. రాష్ర్ట ఎన్నికల కమిషనర్, ప్రభుత్వానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రెండు రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య వివాదానికి కారణమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఖరాఖండిగా వ్యవహరిస్తుంటే.. అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్, ఏపీ సర్కార్ మధ్య లోకల్ వార్ పీక్స్కు చేరింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన దగ్గర నుంచి ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకత మొదలైంది. వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్నామని, కరోనా భయం తొలగిపోలేదని.. ప్రస్తుతానికి ఎన్నికలకు సిద్ధంగా లేమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్, ఎన్నికలూ రెండూ ముఖ్యమేనని.. ఎలక్షన్లు నిర్వహించాలని గురువారం హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా.. ఉద్యోగ సంఘాల వైఖరిలో మార్పు రాలేదు. వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి ఉద్యోగ సంఘాలు. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఎస్ఈసీ ఆదేశాలను పాటించడానికి ఉద్యోగ సంఘాలు ససేమిరా అనడం, ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ భావిస్తుండడంతో క్షణక్షణానికీ పరిణామాలు మారిపోతున్నాయి.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై సర్కార్ మండిపడుతోంది. నోటిఫికేషన్ ఇవ్వద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ పట్టించుకోలేదని మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోవడం లేదు ఎన్నికల కమిషనర్. ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. అధికారుల తీరుపైనా సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రారెడ్డిపై.. చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాశారు ఎస్ఈసీ. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్కు అధికారులు గైర్హాజరవడంపై.. గవర్నర్కు ఫిర్యాదు చేయాలని నిమ్మగడ్డ నిర్ణయించారు. 2021, జనవరి 24వ తేదీ ఆదివారం గవర్నర్ను కలవనున్న ఆయన.. ఎన్నికల ప్రకటన, ప్రభుత్వ సహాయ నిరాకరణపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికలు నిర్వహించి తీరుతానంటూ నిమ్మగడ్డ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం వాదిస్తున్నాయి. దీంతో.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ.. గ్రామాన్ని తలపిస్తోంది.