కోవిడ్–19 కేర్ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందాలని, అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లోనూ ఏ లోటు ఉండరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్–19 నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రోగులకు సదుపాయాల విషయంలో, వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఔషధాలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. కరోనా మైల్డ్ పాజిటివ్ కేసులకు సంబంధించి రోగులకు వైద్య సేవలందించేందుకు అన్ని జిల్లాలలో కనీసం 3 వేల నుంచి 4 వేల బెడ్లు సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించాలని బెడ్లు, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు. రోజంతా వైద్య సేవలందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అన్ని సదుపాయాలతో మంచి చికిత్స అందించాలన్నారు. కొంత మంది హోం క్వారంటైన్లో ఉంటున్నారు కాబట్టి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలని వారిలో మనోధైర్యం కలిగించాలన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉందన్న ధీమా కల్పించాలని సూచించారు.