సుధీర్ మక్కర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ‘గోల్డెన్ బాబా’ పేరు చెబితే ఠక్కున గుర్తుకొస్తాడు. ఏటా కన్వార్ యాత్రలో ఈ గోల్డెన్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోల్డెన్ బాబా(59) ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1972 నుంచి సుధీర్ భారీగా బంగారం ధరించడం మొదలెట్టారు. బంగారం తన ఇష్టదేవత అని ఆయన చెబుతుంటారు. బాబాపై పలు క్రిమినల్ కేసులు సైతం ఉన్నాయి. బాబాగా మారకముందు సుధీర్ ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్లో వస్త్ర వ్యాపారం చేసేవారు.గతేడాది కన్వార్ యాత్రలో బాబా 14కిలోల బంగారం ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2018లో ఆయన 20కేజీల బంగారం ధరించి మరో సారి తన ప్రత్యేకత చాటారు. అనారోగ్యం కారణంగా ఆ తర్వాత నుంచి భారీ బంగారు ఆభరణాలను ధరించడం తగ్గిస్తూ వచ్చారు. బాబా దగ్గర 21 గోల్డ్ లాకెట్లు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు ఉన్నాయి. ఆయన వద్ద బంగారు ఆభరణాలు మాత్రమే కాదు లగ్జరీ కార్లు బీఎండబ్ల్యూ, ఆడీలు, ఇన్నోవాలు, విలాసవంతమైన భవనాలు ఇలా చాలా ఉన్నాయి. బాబా మృతితో ఆయన భక్తులు విషాదంలో మునిగిపోయారు.