కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ విధించిన కారణంగా వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన 2020-21 విద్యా సంవత్సరం ఇంకా మొదలు కానేలేదు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త విద్యా సంవత్సరం 2020-21కి సంబంధించి 33 శాతం సిలబస్ను తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలే సిలబస్ను తగ్గించవచ్చని పేర్కొంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తగ్గించిన సిలబస్కు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే సీబీఎస్ఈ విడుదల చేయనుంది. సిలబస్ మాత్రమే కాకుండా క్వశ్చన్ పేపర్లో కూడా 50 శాతం మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలను ఇవ్వాలని, మిగిలిన థియరీ బేస్డ్ ఉంచాలని, విద్యార్థులకు ఇంటి వద్ద నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా మార్పులు చేసేందుకు సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.