మాస్కు వేసుకోమని చెప్పినందుకు తోటి ఉద్యోగినిపై మరో ఉద్యోగి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఇనుప రాడ్డుతో దాడి చేశారు. కరోనా నేపథ్యంలో మాస్కు వేసుకోమన్నందుకు ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్ ..మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు.