అడవుల్లో ఆహారం లేక ఈ మధ్య కోతులు గ్రామాలల్లోకి వస్తున్నాయి. దొరికిన దగ్గర ఆహారం తింటూ బతుకుతున్నాయి. సాధారణంగా కోతులంటే అందరికి భయమే. ఎందుకంటే అవి ఎక్కడ కరుస్తాయో అన్న భయంతో కోతులు కనిపించగానే అంతా తరుముతుంటారు. వాటి జోలికి వెళ్లకుంటే అవి కూడా ఎవరిని ఏమనకుండా వెళుతుంటాయి. దారి తప్పి నీటి తొట్టిలో పడ్డ ఓ కోతిని కాపాడాల్సింది పోయి ఓ వ్యక్తి ఉరేసి కుక్కలతో కరిపించి చంపాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సాదు వెంకటేశ్వర్ రావు ఇంట్లోని నీటి తొట్టిలో నీళ్లు తాగేందుకు వచ్చిన ఓ కోతి ప్రమాదవశాత్తు పడిపోయింది. దానిని తీసి రక్షించాల్సింది పోయి వెంకటేశ్వర్ రావు ఆ కోతిని దారుణంగా కొట్టి ఉరేసి చంపాడు. దీంతో మిగతా కోతులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. దీంతో పక్కనే ఉన్న వారు వెంకటేశ్వరరావుకు ఓ సలహా ఇచ్చారు. బతికున్న కోతిని వాటి ముందే పట్టుకొని చంపితే కోతులు వెళ్లిపోతాయని చెప్పారు.దీంతో జోసేఫ్ రాజ్ అనే వ్యక్తి సాయంతో కోతిని పట్టుకొని ఉరేసి కుక్కలతో కరిపిస్తూ దారుణంగా చంపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూగ జీవాలను హింసించిన వ్యక్తులను శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.