నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఆదివారం సంఘం కార్యాలయంలో, సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్. రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు వారి దీర్ఘకాలిక జబ్బులకు ఒక నెలకు సరిపడే పన్నెండు వేల రూపాయల ఖరీదు చేసే మందులను, రోటరీ జోన్ చైర్మన్ చాటకొండ సురేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా దివ్యాంగులకు ఉచితంగా మందులను ప్రతి నెలా అందజేస్తున్నామని, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న దివ్యాంగులు డాక్టర్ రాసిన మందుల జాబితా తీసుకుని దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదిస్తే వారికి నిరంతరం మందులు ఉచితంగా అందజేస్తామని, ఈ అవకాశాన్ని అవసరమున్న దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చాట కొండ సురేంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయమన్నారు. తన వంతు సహకారం నిరంతరం అందజేస్తామన్నారు.దివ్యాంగుల కి అనేక సంవత్సరాలుగా సహకరిస్తున్న సురేంద్ర నాథ్ ను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున శాలువా జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం,కోఆర్డినేటర్లు ఎం.పి.వి.రమణయ్య, రామకృష్ణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.