కాపు నిధులపై శ్వేత ప్రతం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. కాపు కార్పొరేషన్కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో తెలపాలని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వెనుకబడిన జాతికి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళన నుంచి కాపుల దృష్టి మరల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంత వరకు కాపులను ఏమర్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పెద్దలు మరింత తెలివితేటలతో ‘గాలికిపోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్న రీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్దరించడానికేనని గొప్పలు చెబుతున్నారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారు.