ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాడి రైతులకు పండగ లాంటి వార్త!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 05:14 PM

ఆంధ్రప్రదేశ్ లోని మూడు లక్షల మంది పాడి రైతులకు పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రెండు నెలల్లోనే ఈ రుణాలు ఇవ్వడానికి పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అభ్యుదయ రైతులు.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలనే ఆలోచన కలిగిన వారిని గుర్తించి హామీ లేకుండా రూ.1.60 లక్షలు ఇవ్వడానికి సిఫారసు చేస్తున్నారు. కరోనా కారణంగా పాడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో వీరిని ఆదుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే ఆరు వేల దరఖాస్తులు తీసుకున్నారు. ఒక ప్రత్యేక కార్యక్రమంగా భవించి విజయవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది.


ఈ రుణాలతో ఉపయోగాలివే..


పశువులను కొనుగోలు చేయవచ్చు.


పశుగ్రాస సాగుకు, యాంత్ర పరికరాల కొనుగోలుకు రుణాలు వాడుకోవచ్చు.


1.50 కోట్ల మందికి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు


దేశంలో 1.50 కోట్ల మంది పాడి రైతులకు కేంద్రం పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వనుంది. ఈ కార్డు ద్వారా రైతులు రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు. భూమి లేని రైతులకైతే ఎటువంటి హామీలేకుండా రూ.1.60 లక్షల వరకు ఇస్తారు. ఈ రుణాలపై కేంద్రం 9 శాతం వడ్డీరేటు నిర్ణయించింది. సకాలంలో రుణం చెల్లించే రైతులకు 5 శాతం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 4 శాతం (పావలా వడ్డీ) వడ్డీని కొన్ని రాష్ట్రాలు రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాయితీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండో దశలో మేకలు, గొర్రెల పెంపకందారులకు ఈ రుణాలు ఇస్తారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఈ పథకానికి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించనుందని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com