వాట్సాప్ వాడడమే ఆ బాలికలు చేసిన శాపమైంది. నకిలీ ఆధారాలతో సిమ్ కార్డులు తీసుకున్న కొందరు ఈ బాలికల అమయాకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు దండుకున్నారు. వాట్సాప్ తో చాటింగ్ చేసి.. అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ వారితో ఆడుకున్నారు. ఎట్టకేలకు ఈ దుర్మార్గుల పాపాల పుట్ట పగిలింది. ఆ కేటుగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్లో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ బాలిక కూడా ఉండడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తార్ఖాన్, మనీశ్, పూజా స్నేహితులు. సత్తార్ ఎయిర్టెల్ ప్రమోటర్గా పనిచేస్తున్నాడు. అతడు వీరికి నకిలీ ఆధార్కార్డులతో సిమ్ కార్డ్స్ను సమకూర్చేవాడు. సత్తార్ఖాన్ సహాయంతో మనీశ్, పూజా ఈ నకిలీ నెంబర్ల నుంచి సదరు బాలికలకు కాల్ చేసి, వాట్సాప్ చాటింగ్ చేసేవారు.అనంతరం ఆ చాటింగ్ బయట పెడతామని బ్లాక్మెయిల్కు గురిచేసి డబ్బులు దండుకునేవారు. చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో నగదు జమచేయకపోతే వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడేవారు. నిందితుల్లో ఒకరు ఇటీవలే 12వ తరగతి పాస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వాట్సప్ చాట్ హ్యాక్ చేసి పల్వాల్, ఫరిదాబాద్, గురుగ్రామ్, ఢిల్లీలో 100 మందికి పైగా బాలికలను బ్లాక్మెయిల్కు గురిచేసి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. వీరి భారిన పడ్డ ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరిదాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. నిందితులు కొంతమంది స్కూలు, కాలేజీ విద్యార్థులతో పరిచయం పెంచుకొని వారి నుంచి ఫోన్ నంబర్లు తీసుకునేవారని పోలీసులు తెలిపారు.