ఏపీ బీజేపీ రెండవ వర్చువల్ బహిరంగ ర్యాలీ సోమవారం 4 గంటలకు ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం, కేంద్ర పథకాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చిన పథకాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇదే విషయమైన ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ రెండోదఫా పాలనలో చేసిన అభివృద్ధిని ఆంధ్ర ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోదర్, ఎంపీ జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాదవ్తో పాటు ఇతర నేతలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భౌతిక దూరం పాటిస్తూ 20 చోట్ల ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.