కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు వ్యాపిస్తోంది. ఒకప్పుడు తగ్గినట్లే తగ్గిన మహమ్మారి మళ్లీ జిల్లాపై పంజా విసురుతోంది. కోయంబేడు మార్కెట్ తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారితో ఈ కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి. రోజు రోజుకు డబుల్ డిజిట్ లో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 24 గంటల్లో ఎన్నడూ లేని విధంగా 61 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.గత నాలుగురోజులుగా పరిశీలిస్తే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 50కి తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1144కు చేరుకున్నాయి. ఇకపోతే జిల్లాలో 686 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో 429 మంది చికిత్స పొందుతున్నారు. ఇకపోతే జిల్లాలో 29 మంది మృత్యువాత పడ్డారు. గత వారం రోజులుగా ఆ రెండు నియోజకవర్గాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.ఆదోని, కర్నూలు నియోజకవర్గాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో ఆదోనీలో ఏకంగా 27 కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఆ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 228కి పెరిగాయి. ఇకపోతే కర్నూలు నియోజకవర్గంలో మరో 17 కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఆ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 559కి చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనే 787 కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో ఆ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.ఇదిలా ఉంటే పెండేకల్లు గ్రామంలో ఓ నిండు గర్భిణీకి కరోనా సోకింది. ఇటీవల గర్భిణీలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పెండేకల్లుకు చెందిన గర్భిణీకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆమె ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే కరోనా సోకడానికి గల కారణాలపై ఆరా తీశారు. అయితే కర్నూలులో బుధవారపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇకపోతే గర్భిణికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఎవరినీ బయటకు రాకుండా..కొత్తవారు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు అటు వైద్యాధికారులు...పోలీసులు చర్యలు తీసుకున్నారు.