పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నూతన వధూవరుల సహా కారు డ్రైవరు మృతి చెందారు. నూతన దంపతులైన యడ్లపల్లి వెంకటేష్ (30), మానస నవ్య (26), ఆమె తమ్ముడు భరత్తో కలిసి గుంటూరు జిల్లా గోవాడ నుంచి విశాఖకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భీమడోలు సమీపంలోని పూళ్ల వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్ మీదుగా రహదారి అవతలి వైపునకు దూసుకెళ్లింది.
అదే సమయంలో ఏలూరు వైపు వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కారు డ్రైవర్ చంద్రశేఖర్ (64)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ క్షతగాత్రులను స్థానికుల సాయంతో తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. అప్పటికే ఆ ముగ్గురూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయాపాలైన భరత్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్, మానసకు ఈ నెల 14న వివాహం కావడం గమనార్హం. ప్రమాద విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి